స్కిల్ స్కామ్ కేసులో జగన్‌ది పైశాచిక ఆనందమే: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

by Disha Web Desk 21 |
స్కిల్ స్కామ్ కేసులో జగన్‌ది పైశాచిక ఆనందమే: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలు చేస్తుంటే.. ఆధారాలు లేని స్కాముల పేరుతో చంద్రబాబును అరెస్టు చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో అన్నిరంగాలు నేలమట్టం అయ్యాయని ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభంలో పడింది. రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రైతాంగం కష్టాలు అధికమయ్యాయి అని ఆరోపించారు. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, బీసి,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు, విద్యుత్తు చార్జీల పెంపు, తీవ్ర ఆర్ధిక సంక్షోభం వంటి అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం ఈ సమస్యలన్నింటిని వదిలేసి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిన దాఖలాలు లేవు. సభలో సమస్యలు వదిలేసి స్కోత్కర్శకాలు వినిపిస్తున్నారు. అన్నీ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొన్నట్లే అసెంబ్లీలో కూడా తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారు అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా అరెస్ట్ చేసి కోర్టుల ముందు అబద్దాలు పెట్టి నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పోకడ ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాష్ట్ర భవిష్యత్ కు ప్రమాదంగా మారుతుంది అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు కుట్ర చేయలేదు

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌ని చంద్రబాబు కేబినెట్‌కు తెలియకుండా నెలకొల్పారు అని వస్తున్న ఆరోపణలను యనమల రామకృష్ణుడు ఖండించారు. అధికారులు ఫైలు పెట్టి ముందు జీవో ఇచ్చి తరువాత కేబినెట్ లో రాటిఫికేషన్ చేద్దామని రాస్తే సీఎంగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు అని తెలిపారు. అదే ఫైలులో విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం సహాని, ఆర్ధిక శాఖ కార్యదర్శి అజయ్ కల్లాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు లు కూడా సంతకాలు పెట్టారు అని గుర్తు చేశారు. అలాగే అడ్వాన్స్ గా రూ.370 కోట్లు విడుదల చేసి కోట్ల కుంభకోణానికి చంద్రబాబు కుట్ర పన్నారు అన్న వైసీపీ ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 50 కింద సాక్ష్యం ఇస్తూ అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రేమ్ చంద్రారెడ్డి రూ.370 కోట్లు తానే విడుదల చేశానని, ఆర్థిక శాఖకు చెప్పి కేంద్ర సంస్థతో మదింపు చేయించానని తరువాత తన రిటైర్ మెంట్ తరువాత వచ్చిన అధికారులు పర్యవేక్షణకు బాధ్యులని చెప్పారని యనమల గుర్తు చేశారు. ఈ నిధుల చెల్లింపుకు సంబంధించిన పైళ్ళు కూడా ఏసీబీ కోర్టు దాఖలు చేసిన పత్రాల్లో ఉన్నాయని..ఎవరూ పట్టించుకోరు అని అన్నారు. ప్రేమ్ చంద్రారెడ్డి ఎఫ్ఐఆర్ లో లేనప్పుడు, ఆ నిధులు విడుదల చేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, పి.వి.రమేష్, సునీత ఎవరూ బాధ్యులు కానప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే బాధ్యుడు అవుతాడు అనడం దుర్మార్గపు వాదన కాదా? అని యనమల రామకృష్ణుడు నిలదీశారు. అంతేకాదు ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు బలవంతం చేసి నిధులు విడుదల చేయించారన్న వాదనల్లో సైతం ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చారు.

అసలు సీమెన్స్ సంస్థతో సంబంధమే లేదు

సీమెన్స్ అనే పేరు బాగుందని చంద్రబాబు నాయుడు బోర్డు పెట్టారని మాజీమంత్రి పేర్ని నాని చెబుతున్నారు. సీమెన్స్ గ్లోబల్ వారు మాకు సంబంధం లేని ఉత్తరం రాశారని సీఐడీ చీప్ సంజయ్ చెబుతారు. సాక్ష్యాత్తు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీమెన్స్ 90:10 అనేది మాకు తెలియదు అందని అలాంటిది ఎక్కడా ఉండదని హేళనగా మాట్లాడతారు అని యనమల రామకృష్ణుడు అన్నారు. సీమెన్స్ ప్రస్తుత ఎండి మాథ్యూస్ తరువాత ఇండియాలో సీమెన్స్ కు అధిపతిగా ఉన్న వ్యక్తి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారికి సెక్షన్ 50 క్రింద స్టేట్ మెంట్ ఇస్తూ సీమెన్స్ సంస్థ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం నిజమని తమ సాప్ట్ వేర్ / హార్డ్ వేర్ / సేవల ధరలలో భారీ డిస్కౌంట్లు ఇచ్చి ఈ ప్రాజెక్టులను అన్ని దేశాలలో చేస్తామని అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు అని రూ.3000 కోట్లు నగదు ఇస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పమని ఆ విలువ మేరకు డిస్కౌంట్ లు ఇస్తూ సీమెన్స్ / డిజైన్ టెక్ సంస్థలు సాప్ట్ వేర్/హార్డ్ వేర్ సేవలు అందిస్తాయని ఈ పద్దతిని దేశంలోనే అనేక రాష్ట్రాలలో యూనివర్సిటీలలో చూడవచ్చని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ పత్రాలు సీఐడీ అధికారులకు అందుబాటులో ఉన్నప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆదాయపు పన్ను కేసులో మనోజ్ అనే వ్యక్తి చంద్రబాబునాయుడుకి డబ్బులు ఇచ్చానని చెప్పారన్నది కేవలం ఆరోపణలు మాత్రమేనని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా సెక్రటేరియట్‌లో ఉద్యోగం నిర్వహిస్తున్నపుడు ఆయనను ఎందుకు విచారించలేదో ఇప్పుడే ఆయన పేరు మీద దుష్ప్రచారం చేస్తున్నారో సీఐడీ అధికారులు సమాధానం చెప్పాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Read More: క్వశ్చన్ అవర్ స్టార్ట్.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న సీఐడీ అధికారులు..!




Next Story